జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ కీలక నేత మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురై గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆసుపత్రి వర్గాలు ఇంకా అధికారిక హెల్త్ బులెటిన్ విడుదల చేయలేదు. కాగా, కొన్ని నెలలుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారనీ, ముఖ్యంగా కిడ్నీ సమస్యతో అనారోగ్యం పాలైనట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం, మాగంటి ఆరోగ్య పరిస్థితిపై సమాచారం అందుకున్న మాజీ మంత్రి హరీశ్రావు సహా బీఆర్ఎస్ నేతలు ఆసుపత్రికి చేరుకొని ఆయన ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. అయితే, కొన్ని ఎక్స్ పోస్టులు, వార్తా సంస్థలు.. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించారని ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి పుకార్లను ప్రచారం చేయొద్దని, ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులు మీడియా వర్గాలను కోరుతున్నారు.