తెలంగాణ రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) ఫార్ములా ఈ-కార్ రేస్ అవినీతి కేసులో ఏసీబీ (ఆంటీ కరప్షన్ బ్యూరో) విచారణకు హాజరయ్యారు. బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయానికి వచ్చిన కేటీఆర్ చుట్టూ మీడియా, కార్యకర్తలతో హైటెన్షన్ నెలకొంది.
ఫార్ములా ఈ కేసు – అసలు విషయం ఏమిటి?
గత బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్లో జరిగిన ఫార్ములా ఈ-రేస్కు సంబంధించి రూ. 54.89 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఇందులో కేటీఆర్ను A1 ప్రధాన నిందితుడిగా ఏసీబీ ఎఫ్ఐఆర్లో పేర్కొనడం గమనార్హం. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ (A2), హెచ్ఎండీఏ మాజీ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి (A3) మరో ఇద్దరు కీలక నిందితులుగా ఉన్నారు.
30 సార్లు పిలిచినా హాజరవుతాను” – కేటీఆర్
తండ్రి కేసీఆర్ను కలిసిన అనంతరం, కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, ఇది పూర్తిగా రాజకీయ ప్రేరిత దాడి అని ఆరోపించారు.
“హైదరాబాద్ బ్రాండ్ను కాపాడినందుకు జైలుకెళ్లాల్సి వచ్చినా వెళ్తాను. ఏ ప్రభుత్వం వచ్చినా సత్యం అర్థం చేసుకుంటుంది,” అంటూ స్పష్టమైన సందేశం ఇచ్చారు.
ఏసీబీ ప్రశ్నలు – డబ్బు బదిలీలు, ఒప్పందాలపై విచారణ
ఏసీబీ ఈ విచారణలో కేటీఆర్ను రూ. 46 కోట్లు విదేశాలకు బదిలీ, ఆర్బీఐ అనుమతుల్లేకుండా చెల్లింపులు వంటి కీలక అంశాలపై ప్రశ్నించినట్లు సమాచారం. ఇప్పటికే జనవరిలోనూ కేటీఆర్ను విచారించిన ఏసీబీ, ఇప్పుడు కేసును మరింత లోతుగా పరిశీలిస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కేసును రాజకీయ లబ్దికోసం వాడుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఒకవైపు ప్రజాధన వినియోగంపై చర్చ, మరోవైపు రాజకీయ వేడి… ఈ కేసు రాష్ట్ర రాజకీయ దిశను మార్చేలా కనిపిస్తోంది.