తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ ప్రక్రియ కీలక దశకు చేరుకున్నట్లే ఉంది. జూన్ 11 2025న, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. ఆయనతో పాటు కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలు భారీ స్థాయిలో బీఆర్కే భవన్కు చేరుకున్నారు.
బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు హాజరు
ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీలు కాళేశ్వరం ప్రాజెక్టును విఫలమైనదిగా చిత్రీకరించి, కేసీఆర్ ఇమేజ్ను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. “కాళేశ్వరం వంటి గొప్ప ప్రాజెక్టును రాజకీయ కుట్రలకు ఉపయోగిస్తున్నారనీ.. ఇది ఒక వ్యక్తి నిర్ణయం కాదు, తెలంగాణ కేబినెట్ ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం” అని అన్నారు.
అలాగే, కాంగ్రెస్ ప్రభుత్వం తమ అవినీతిని కప్పిపుచ్చేందుకు ఈ విచారణను ఉపయోగిస్తోందని, కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ రైతులకు జీవనాడిగా నిలిచిందని కేటీఆర్ పేర్కొన్నారు. “మరో దేశంలో ఈ ప్రాజెక్టు నిర్మించి ఉంటే చరిత్రలో నిలిచిపోయేది” అని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో సీపేజ్ సమస్యల కారణంగా ఈ విచారణ కమిషన్ ఏర్పాటైంది. కేసీఆర్ ఈ ప్రాజెక్టు వెనుక ప్రధాన వ్యక్తిగా ఉన్నందున, ఆయన వివరణ కీలకంగా భావిస్తున్నారు. అయితే, బీఆర్ఎస్ నాయకులు ఈ విచారణను రాజకీయ కుట్రగా అభివర్ణిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ను టార్గెట్ చేస్తోందని ఆరోపిస్తున్నారు.
నిజానికి, కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన, అమలులో కీలక భూమిక పోషించిన కేసీఆర్ను కమిషన్ తొలుత జూన్ 5న విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. అయితే.. వ్యక్తిగత పనుల కారణంగా ఆ రోజు హాజరు కాలేనని, జూన్ 11న హాజరవుతానని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఆయన అభ్యర్థన మేరకు కమిషన్ విచారణ తేదీని మార్చింది కమీషన్. మరోవైపు, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారాలను పర్యవేక్షించిన మాజీ మంత్రి హరీశ్రావు మాత్రం కమిషన్ నోటీసుల్లో పేర్కొన్న ప్రకారం జూన్ 9నే విచారణకు హాజరయ్యారు.